సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లో రూ.700 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. స్థలాన్ని స్వాధీనం చేసుకొని బడాబాబుల ఆగడాలకు హైడ్రా చెక్ పెట్టినట్లయ్యింది. పార్కులు, ప్రజావసరాలకు లే అవుట్ లో కేటాయించిన స్థలాలకు బై నంబర్లు వేసి సొమ్ము చేసుకునే ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. దాదాపు 4 ఎకరాల పార్కులు, ప్రజావసరాల స్థలానికి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కు స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది. అక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ. 200ల కోట్లు వరకూ ఉంటుంది. కొండాపూర్లో 57.20 ఎకరాల విస్తీర్ణంలో 627 ప్లాట్లతో శ్రీ వేంకటేశ్వర హెచ్ ఏ ఎల్ కాలనీని 1980 దశకంలో ఏర్పాటు చేశారు. 1.20 ఎకరాల చొప్పున 2 పార్కులు, 2 ఎకరాల పరిధిలో మరో పార్కుతో పాటు.. 1000 గజాల మేర ప్రజావసరాలకు కేటాయించారు.
ప్రజావసరాలకు కేటాయించిన తలాలపై బడా బాబుల కన్ను పడింది. పార్కులకు బైనంబర్ల ద్వారా ప్లాట్లుగా మార్చేసి అమ్మేశారు. ఈ విషయమై దశాబ్దాలుగా పోరాడుతున్న శ్రీ వేంకటేశ్వర హెచ్ ఏ ఎల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాను ఆశ్రయించారు. అబ్బినేని అనసూయతో పాటు ఇతరుల దగ్గర నుంచి వైబీకే రావు జీపీఏ కుదుర్చుకుని 1980 దశకంలో లే ఔట్ వేశారు. ఆ లే ఔట్ ప్రకారం ప్లాట్లు కొన్నవారు ఆయా ప్లాట్లను, నిర్మించిన భవనాలను ఎల్ ఆర్ ఎస్, బీఆర్ ఎస్ ద్వరా రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు. 1.20 ఎకరాల మేర ఉండాల్సిన పార్కును 3 భాగాలుగా విడదీసి 11 ప్లాట్లు చేసి అమ్మేసినట్టు నిర్ధారణ అయ్యింది. మరో రెండు పార్కులను కూడా అలాగే బై నంబర్లతో పలువురికి అమ్మేశారు. ఇక్కడ లావాదేవీలు నిర్వహించిన వారికి ఎన్.ఆర్.ఐ. లే ముడిసరకుగా మారారని అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా అధికారులకు తెలిపారు. వారి దగ్గర నుంచి సింహా డెవలపర్స్, వాసవి నిర్మాణ సంస్థతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కొని బౌన్సర్లను పెట్టి.. పార్కులవైపు వెళ్లడం కాదు కదా.. చూడడానికి కూడా అవకాశం లేకుండా చేశారని.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారుల ముందు అక్కడ నివాసం ఉన్న వారు వాపోయారు. రెసిడెంట్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. పార్కులతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడాలని హైకోర్టు కూడా సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్డులను హైడ్రా ఏర్పాటుచేసింది.
Cyber City NewsAdmin