సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద రద్దీ నివారణకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తుంది. టోల్ ప్లాజాల లో నగదు చెల్లింపులపై నిషేధం విధించనుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అన్ని నేషనల్ హైవే టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు పూర్తిగా నిషేధంకచనున్నట్లు తెలుస్తుంది. ఇకపై టోల్ చెల్లించడానికి ఫాస్టాగ్ ,యూపీఐ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. హైవేలపై గంటల తరబడి నిలిచే రద్దీని తగ్గించి, ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి విప్లవాత్మక ముందడుగుగా భావించ వచ్చు. ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద పండగ సమయంలో నగదు చెల్లింపులతో వాహనాలు క్యూ లో కిలోమీటర్ల తరబడి బారులు తీరుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ తో బ్రేక్ వేసి, యాక్సిలరేట్ చేసి, మళ్లీ ఆగడం తో ఇంధనం వృథా అవుతోంది. కొత్త నిబంధనతో ఈ సమస్యలకు ఫుల్స్టాప్ పడుతుంది. భవిష్యత్తులో నో-స్టాప్ టోలింగ్ (బ్యారియర్ లేకుండా హైవే స్పీడ్లోనే ప్రయాణం) కూడా రానుందని సమాచారం. ప్రస్తుతం 25 టోల్ ప్లాజాల్లో ఇది పైలట్ ప్రాజెక్ట్గా జరుగుతోంది.
కేంద్రం తీసుకున్న ఈ మార్పులు అమల్లోకి రావడానికి కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ప్రయాణికులు ఇప్పటి నుంచే ఫాస్టాగ్ ను తీసుకొని సిద్ధపడితే ఏప్రిల్ నుంచి అవస్థలు తొలగిపోతాయి. ఫాస్టాగ్ లేని వారు తక్షణమే బ్యాంకు లేదా ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్లో యూపీఐ యాప్లు సిద్ధం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న వ్యాపారుల్లో ఇంకా డిజిటల్ చెల్లింపులకు అలవాటు లేని వారికి ఇది కొంత ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కానీ ప్రభుత్వం ఈ విషయంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. నగదు రహిత టోల్ వసూళ్లతో ఇంధన ఆదా, తక్కువ కాలుష్యం, పారదర్శకత, వేగవంతమైన ప్రయాణాలు.. ఇవన్నీ ఒకేసారి సాధ్యమవుతున్నాయని చెబుతున్నారు. ఇది కేవలం టోల్ ప్లాజా మార్పు మాత్రమే కాదు.. ఇది భారత రహదారుల భవిష్యత్తుకు కొత్త అధ్యాయంగా మారుతుందని విశ్వసిస్తున్నారు. ఇక హైవేల మీద ప్రయాణం.. సాఫీగా.. సులభంగా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
Cyber City NewsAdmin