సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : ఐటీ కారిడార్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సమీపంలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. గురువారం వందలాది తాత్కాలిక షె డ్డులను, పదుల సంఖ్యలో ఉన్న షాపులను తొలగించింది. మొండి కుంట ఆక్రమణలను నేలమట్టం చేసింది. మొండికుంట, ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. చెరువుతో పాటు.. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలు తొలగించి 11 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ. 2200 ల కోట్లు ఉంటుందని హైడ్రా తెలిపింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబరు 53లోని మొండికుంటతో పాటు.. సర్వే నంబరు 55లోని ప్రభుత్వ భూమి ఎకరాల కొద్దీ ఆక్రమణలకు గురి అవుతోందని అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాలమేరకు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టింది. దాదాపు 11 ఎకరాలు కబ్జాకు గురైనట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆలయాన్ని హద్దుగా చూపించి కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడినట్టు నిర్ధారించారు. ఆలయం హద్దుగా పలు షాపులు, మెకానిక్ షెడ్డులు, ఐరన్ స్టీల్ షాపు ఇలా అనేక రకాల వ్యాపార సముదాయాలు ఉన్నట్లు గుర్తించారు. 30కి పైగా ఉన్న షాపుల ద్వారా నెలకు రూ. లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నట్లు తెలిపింది.
మొండికుంటతో పాటు.. అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలపై జనవరి 31న హైడ్రా విచారణ కూడా చేపట్టింది. రెవెన్యూ అధికారులతో పాటు.. కబ్జాలకు పాల్పడిన వారు కూడా ఈ సమవేశంలో పాల్గొన్నారని తెలిపారు. వారి సమక్షంలోనే ఆక్రమణలు జరిగినట్టు రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఎన్ ఆర్ ఎస్ సీ శాటిలైట్ చిత్రాలను పరిశీలించి కూడా ఆక్రమణలు జరిగినట్టు నిర్ధారించారు. ఇదే విషయాన్ని కబ్జాదారులకు తెలియజేశారు. వారికి కొంత సమయాన్ని ఇచ్చి గురువారం హైడ్రా ఆక్రమణలను తొలగించే పనిని చేపట్టింది. వందల సంఖ్యలో ఉన్న తాత్కాలిక షెడ్డులను భారీ బందోబస్తు మధ్య హైడ్రా తొలగించింది. మొండికుంట చెరువును కాపాడినందుకు అక్కడ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించిన చోట పార్కులను అభివృద్ధి చేయాలని స్థానికులు హైడ్రా అధికారులను కోరారు. చెరువును అభివృద్ధి చేసి సుందరీకరించాలని సూచించారు.
Cyber City NewsAdmin